"దైవ సన్నిధి సంతోషము" - నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు" కీర్తనలు 16:11 - Father.Mungamuri Devadasu Ayyagaru upadeshamu
దైవ సన్నిధి
సంతోషము
“జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు" కీర్తనలు 16:11.
ప్రియులారా! ఈవేళ ఆదివారము ఆరాధన దినము, ప్రత్యేక ఆదివారము. ప్రభువుయొక్క పునరుత్థానమును జ్ఞాపకము చేసికొనవలెను. ఈస్టరు పండుగనాడేకాదు ప్రతిదినము మనకు పునరుత్థానము అవసరము. గుడిలో జరిగేది ఆరాధన. ఇక్కడ ఆరాధన కొరకు ప్రత్యేకించుకొన్నాము
గనుక ఈ స్థలము కూడ దేవాలయము వంటిదే. మనము ఇప్పుడు దేవాలయములో ఆరాధనకు కూడుకొనియున్నాము అని జ్ఞాపకము ఉంచుకొనండి.
ఈరోజు నా ప్రసంగవాక్యము కీర్తనలు 16:11 “జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు" అనేదైయున్నది. బైబిలంతటిలో 'దైవసన్నిధి' అనేమాట కనబడుచున్నది. ఎక్కడ ఆ మాట కనబడునో అక్కడ సన్నిధియొక్క ఉనికి కనబడును. ఈ అంశమును రెండు భాగములు చేయుచున్నాను.
1)
దేవుడు తన సన్నిధిని నరులకు అనుగ్రహించుట, 2) నరులే దేవుని సన్నిధికి వచ్చుట. ఈ రెండు భాగములలో ఏది ముఖ్యము? దేనికదే ప్రాముఖ్యము. దైవసన్నిధి మన దగ్గరకు రాకపోతే, మనము దేవుని సన్నిధికి వెళ్ళవలెను. ఇవి రెండు అంశములు. ఈ రెండు అంశములను గూర్చి వినండి.
భూమిమీద దేవాలయము దేవుని సన్నిధి యొక్క స్థానము. అందుచేతనే భక్తుడు దేవాలయము కట్టినాడు. మనుష్యులు ఆ దేవాలయమునకు వెళ్ళితే దేవుడు అక్కడికి వస్తాడు ఇది రెండవ భాగము. అంటే నరులే ఆయన సన్నిధికి వచ్చుట మొదటి భాగము. ఈ భాగములో రెండవ సంగతి ఏమిటంతే భక్తులందరు పరలోకమునకు వెళ్ళిన తరువాత అక్కడ నిత్య సన్నిధి ఉండును. ఇవి రెండు. మొదట చెప్పినవి రెండు. మొత్తము నాలుగు జ్ఞాపకముంచుకొనండి.
1.
దేవుని
సన్నిధి
నరులయొద్దకు
వచ్చుట:-
1వ కథ: - ఆదాము, హవ్వల కథ. ఆది 3:8 “చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను". ఈ కథలో ఆదాము, హవ్వలు చెట్టు చాటున దాగి ఉన్నప్పుడు దేవుడే వారి యొద్దకు వచ్చెను.కాని ఆదాము, హవ్వలు దేవుని దగ్గరకు వెళ్ళలేదు. తమ దోష భావం బట్టి పాపము చేసామన్న అంతరాత్మ ప్రబోధం వలన ఆదాము, హవ్వలు దేవునికి దూరముగా వెళ్లారు. తాము పాపము చేసామని, ఆయనకు కోపము కలిగించామని గ్రహించి, భయపడి సంతోషంగా ఉండలేక పోయారు. ఈ పరిస్థితిలో ధైర్యంగా ఆయన దగ్గరకి వెళ్లటం అసంభవం అని తెలిసికొన్నారు. అప్పుడు దేవుడు తన సన్నిధితో వచ్చి వారు చేసిన పాపమునకు శిక్షగా ఆదాము, హవ్వలకు శిక్ష విధించి, స్త్రీ సంతానమున క్రీస్తును ఈలోకమునకు అనగా రక్షకుని పంపిస్తాను అనే దీవెన వినిపించినాడు.Genesis
3:15-19.
1)
దేవుడు ఆదాము, హవ్వతో "నీ ప్రయాసమును, నీ గర్భమును మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కనెదవు, నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని" చెప్పెను ఆది. 3:16, 2) ఆదాముతో "నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష పలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడియున్నది. ప్రయాసముతో నీవు బ్రతుకుదినములన్నియు దాని పంట తిందువు అనెను” ఆది. 3:17. ఈ పై వాక్యములో మూడు దీవెనలు ఉన్నాయి. 1. సంతానము 2. పంట, 3. యేసుప్రభువు లోకమునకు రక్షకుడుగా వచ్చుట. యేసుప్రభువు పేరు అక్కడలేదు. స్త్రీ సంతానము అని ఉన్నది. ఆ సంతానము క్రీస్తే అని పౌలుగారు వ్రాస్తున్నారు. మన పాపపు స్థితిలో మనముకూడా ఆదాము, హవ్వలవలె ఉన్నాము. అయినప్పటికి యేసుక్రీస్తు అనే ఏకైక “మార్గము”లో మన మనస్సాక్షి అపరాధాన్ని కడిగివేసికొనే మార్గాన్ని అనుసరించి దేవుడు మనలను పాపమునుండి విడిపించారు. తన సహవాసములోనికి అనగా పూర్వస్థితికి తీసికొనివచ్చాడు. యోహాను 14:6. గనుక దేవుని సన్నిధికి వచ్చిమన మధ్యకు ఈ మూడు దీవెనలు మనకు తెచ్చింది. అలాగే మనము కూడా ఇప్పుడు దేవుని సన్నిధి కలిగియుంటే మనకును ఈ మూడు దీవెనలు లభిస్తాయి.
2వ కథ: - హనోకు కథ.
ఆది 5:22 "హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను”. దేవుని సన్నిధి భూలోకమునకు వచ్చి హనోకును పరలోకమునకు తీసికొని వెళ్ళినది.
హనోకు దేవునితో నడచుట:- దైవ భక్తిలో హనోకు ఇతరులను అధిగమనించి జీవించాడు అన్నమాటలో సందేహము లేదు. హనోకు గురించి బైబిలు ఏమి చెప్తుందో గమనించండి.
1)
యూదా 14, 15 ప్రకారము "అతని తరములో దైవభక్తి లేనివారికి వేరుగా ఉన్నాడు”. ఆది. 5:22, 24 “అతడు దేవునితో నడిచాడు” అంటే దేవునిపై నమ్మకంతో ఆయన వాక్యాన్ని, వాగ్దానాలని నమ్మి జీవించాడు హెబ్రీ 11:5,6. పవిత్రంగా జీవించాడు, దేవుని విధానాలను అవలంభించాడు.
2)
హనోకు తన తరములోని వారిని, పాపమును, దుస్థితిని బహిరంగముగా తప్పుబట్టిన నీతి బోధకుడు. భక్తిహీనతకు, అవినీతి కార్యాలకు వ్యతిరేకంగా వారిని శిక్షించడానికి దేవుడు వస్తున్నాడని హనోకు గళమెత్తి పలికెనని హెచ్చరించాడని అతనిని గూర్చి యూదా 14,15 వచనములో వ్రాయబడియున్నది.
3)
హనోకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. హెబ్రీ 11:5 అతని జీవితాన్ని మరియు సందేశాన్ని దేవునితో సహానుభావాన్ని దేవుడెంతో ఇష్టపడ్డాడు. అతడు మరణానుభవం పొందకుండగనే దేవుని సన్నిధిలో శాశ్వతంగా ఉంటానికి భూమిమీద నుండి అతన్ని తీసికెళ్లాడు. మనముకూడా హనోకు జీవితాన్ని ఆదర్శంగా తీసికోవాలి.
మనము చెడుగుతో కూడిన దైవభక్తిలేని తరములో జీవిస్తున్నాము. మనము దేవునితో నడుస్తున్నామా? పాపాన్ని విడనాడుతున్నామా? రాబోయే ఉగ్రత నుండి పారిపొమ్మని హెచ్చరిస్తున్నామా?
అపో.కార్య. 3:19,20, శాశ్వతంగా దేవునితో ఉండటానికి యేసుప్రభువు వచ్చి వధువు సంఘమును పరలోకమునకు తీసికొని వెళ్లును 1థెస్స 4:16,17.
3వ కథ:- నోవహు కథ. ఆది. 6-8 అధ్యాయములు.ఆదికాండము 7వ అధ్యాయములో దేవుడు సన్నిధిలో నోవహు దగ్గరకు వచ్చి రక్షణ ఓడ కట్టమన్నారు. నోవహు దేవుని సన్నిధికి వెళ్ళలేదు. దేవుని సన్నిదే ఆయన దగ్గరకు వచ్చెను.
దేవుని సన్నిధి నోవహు దగ్గరకు రావడానికి కారణములు:- నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునైయున్నాడు
ఆది. 6:9. ఆ రోజులలో విస్తారంగా వ్యాపించిన దుర్మార్గం, దుష్టత్వం మధ్య (ఆది. 6:5) నోవహు ఒక్కడే నీతిమంతుడై దేవునితో ఇంకా సహవాసాన్ని వెతుకుతున్నవానిగా దేవుడు గమనించారు. 1. నోవహు తన తరములో, తన చుట్టూ ఉన్న సమాజములోని నైతిక దుర్నీతి ఉన్న సమాజములోని నైతిక దుర్నీతి నుండి నోవహు తనను తాను ప్రత్యేకించుకున్నాడని
తెలుస్తుంది. 2. అతడు నీతిమంతుడైయుండి దేవునికి భయపడుతు, సమాజములో పాతుకుపోయిన అభిప్రాయాలకు, వారి ప్రవర్తనకు విముఖుడైయున్నాడు. గనుక దేవుని దయను పొందాడు. ఆది. 6:8; 7:1; హెబ్రీ 11:7; 2పేతురు 2:5. 3. విశ్వాసముగలిగి దేవునితో నడవడం ద్వారా ఆయన కృపవలన నోవహు జీవితములో నీతి వచ్చింది ఆది. 6:9. విశ్వాసము ఎంత కీలకమైనదంటే అది దేవునితో నడవాలన్నా నమ్మకమైన ప్రయత్నాలను మనలో పుట్టిస్తుంది. 4. నోవహు యదార్థవర్తనుడేకాక నీతిని బోధించాడు 2పేతురు 2:5 దేవుని సన్నిధి నోవహు దగ్గరకు వచ్చిన తరువాత నోవహు అనేక పర్యాయములు దేవుని సన్నిధికి వెళ్లి వచ్చెను.
4వ కథ:- అబ్రాహాము కథ. ఆది. 12వ అధ్యాయము. అబ్రాహాము కల్దీయుల దేశమైన బబులోను పట్టణములో నున్నప్పుడు దేవుని సన్నిధి అబ్రాహాము దగ్గరకు వచ్చి “నేను చూపించు దేశమునకు వెళ్ళము” అనెను. సమర్పణ పూర్వక విశ్వాసముతో తనను తెలిసికోవాలని, తనను సేవించే వ్యక్తి కావాలని దేవుడు తలంచారు. 1) అబ్రాహామునకు వచ్చిన పిలుపులో తన దేశమునుండి, బంధువుల నుండి, అతని ఇంటివారి నుండి తనను వేరుచేసికోమని దేవుడు చెప్పారు. 2) దేవుడు అబ్రాహామునకు ఒక దేశాన్ని అతని సంతతి ద్వారా ఒక గొప్ప జాతిని, భూమిమీదనున్న సమస్త జాతులను ప్రభావితం చేసే ఆశీర్వాదాన్ని, వాగ్ధానాన్ని చేసాడు. ఆది. 12:2,3. 3) అంతేగాక అబ్రాహామును పిలిచిన పిలుపులో భూసంబంధమైన దేశమేగాక పరలోక సంబంధమైన దేశముకూడా యిమిడి ఉన్నది. 4) అబ్రాహామును పిలిచిన పిలుపులో వాగ్దానములతోపాటు బాధ్యతలుకూడా ఉన్నాయి. దేవుడు అబ్రాహామునకు వాగ్దానముచేసిన వాటిని అతడు పొందుకొనుటకు అతనిలో దేవునికి విధేయత, వ్యక్తిగత సమర్పణ కనిపించాయి. యిట్టి సద్గుణములకు మూలము. దేవుని సన్నిధి ఆయన దగ్గరకు రాబట్టి, ఆయన సన్నిధిలోనికి ఆయన అనేక పర్యాయములు వెళ్ళగలిగారు.
5వ కథ:- ఆది 16వ అధ్యాయము. ఎండవేళప్పుడు అబ్రాహాము తన గుడారమువద్ద ఉన్నప్పుడు ప్రభువు అతని యొద్దకు వచ్చెను. ముఖాముఖిగా మాటలాడెను. ఆది ముఖాముఖిగా సన్నిధి. అబ్రాహాము భోజనము సిద్ధము చేస్తే దేవుడు భుజించారు. అంతకుముందు అబ్రాహాము దేవునికి కాళ్ళకు నీళ్ళిస్తే పుచ్చుకొని కడుగుకొన్నారు. ఎంత గొప్ప సన్నిధి భాగ్యము. ఇటువంటి కథ బైబిలులో రెండవది మరెక్కడా ఉన్నట్లు నేను చూడలేదు.
6వ కథ:- ఆది 18:22-33. లోతు కథ. సొదొమ గొమొర్రా పట్టణము వెలుపటి కథ. ఆది. 18:22 అబ్రాహాము ఇంకా దేవుని సన్నిధిని నిలుచుండెను. లోతునుబట్టి, అతని యింటి వారిని బట్టి ఆ పట్టణాలను నాశనము చేయవద్దని అబ్రాహాము దేవున్ని ప్రార్థించారు. అబ్రాహాము ఆశించిన విధానములో కాకపోయిన దుర్మార్గులతోపాటు నీతిమంతులను దేవుడు రక్షించి దుష్టులను శిక్షిస్తానని అతని ప్రార్థనకు జవాబిచ్చారు. దేవుడు ఒంటరిగా నుండి అబ్రాహాముతో మాట్లాడెను అది దేవుని సన్నిధి. అబ్రాహాము మాట్లాడినారు, దేవుడు మాట్లాడినారు. వంతులు ప్రకారము ఒకరి తరువాత ఒకరు మాట్లాడారు. ఈ గొప్ప సంభాషణ స్నేహితులు వస్తే ఇద్దరు మాట్లాడినట్లుగా వీరిద్దరు గొప్ప సంభాషణ చేసిరి. బైబిలులో వ్రాయబడిన గొప్ప సంభాషణ ఇది.
7వ కథ:- ఆది 28:18. యాకోబు కథ. యాకోబు తన ప్రయాణములో బేతేలునందు విచారముతో నుండగా పరలోకము నుండి ఒక నిచ్చెన తన దగ్గరగా వేయబడియున్నది. ఆది. 28:13-15. యెహోవా సన్నిధి దానికి పైగా నిలిచి అబ్రాహామునకు చేసిన వాగ్దానము యాకోబుద్వారా కొనసాగుతుందన్న వర్తమానముతో దేవుడు అతని దగ్గరకు వచ్చారు. (దేవుని సన్నిధి. ఈ ఆశీర్వాదంతోపాటు ఆయన సన్నిధి, నడిపింపు, కాపుదల అనే వాగ్ధానాలు వచ్చాయి). యాకోబు నిద్రనుండి లేచిన తరువాత దేవుడు ఉన్న స్థలము “దేవుని సన్నిధి” అని పెరుపెట్టెను. ఆ పేరు ఏమిటంటే “బేతేలు". బేతేలు అనగా దేవుని యిల్లు, దేవుడుండే స్థలము. దేవుని సన్నిధి ఉన్న ఏ చోటుకైనా ఈపేరు అన్వయిస్తుంది. (ఆ పేరు మనమున్న యింటికి పెట్టాము),
8వ కథ:- మోషే కథ. నిర్గమ 3వ అధ్యాయము. ఇప్పటికి ఆదికాండము అయిపోయినది. నిర్గమకాండములోనికి అడుగుపెడదాము. ఒక పొద ఉన్నది. ఆ పొదలో అగ్ని రగులుచున్నది. అక్కడ ప్రభువున్నారు, అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడెను. దేవుడు “నేను నీకు చూపించు దేశము వెళ్ళమని అబ్రాహాముతో చెప్పినపుడు అబ్రాహాము వెంటనే వెళ్ళెను”. ఇక్కడ మోషేను వెళ్ళమంటే “నీవు ఎవరినైనా పంపు నేను వెళ్ళలేను, నేను నత్తివాడనని” సాకులు చెప్పినాడు. అప్పుడు బలవంతముగా మోషేను పంపుచు దేవుడు ఒకమాట చెప్పెను. ఈ పొద స్థలము పరిశుద్ధ స్థలము. గనుక నీ చెప్పులు తీసివేయుమని చెప్పెను. దేవుని గురించి మోషేకు కలిగిన మొట్టమొదటి ప్రత్యక్షత. ఆయన పరిశుద్ధత, పవిత్రత అంటే పాపము నుండి, చెడుగునుండి వేరై నీతికి సమర్పించుకోవడం అని అర్ధము. దేవుని సేవకునిగా మోషే తాను సేవించే దేవుడు పరిశుద్ధుడని గ్రహించాడు. ఆయన పరిశుద్ధత ఎంత అమోఘము అంటే ఒక మానవుడు కళ్లారా ఆయననుచూస్తే అతడు మరణిస్తాడని ఎప్పుడు జ్ఞాపకముంచుకోవాలి
(నిర్గమ
3:6; 9:21; యెషయా
6:1-7). మోషే
దేవునితో ఏమన్నప్పటికిని (మా బాగుకొరకేనని). ఆ పొద దగ్గర మోషే దేవుని సన్నిధిని, దేవున్ని చూచెను, దేవుని మాటలు వినెను. ఎంత ధన్యత. ఎదిరించే ఈ మురాభి మనిషికి ఎంత ధన్యత వచ్చింది. ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్లలేదుగాని గొర్రెలు కాచుకోవడానికి వెళ్లినప్పుడు దేవుని సన్నిధి దొరికెను. అలాగే ఇప్పుడుకూడా ఎలాంటి దుర్మార్గులైనా సరే దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు దొరుకును. గద్దింపులు, వర్తమానము, ధైర్యము, అద్భుతాలు, సేవ ఈ మొదలగునవి దైవసన్నిధిలో మనకు నేడుకూడా దొరుకును. నేడు మీ గ్రామములో సన్నిధి కూటములు పెట్టుకొనండి అప్పుడవన్నీ మీకు తప్పక దొరుకును.
9వ కథ:- సీనాయి పర్వతము దగ్గర దేవుని సన్నిధి. నిర్గమ 19వ అధ్యాయము. నిర్గమ 19:20 ఆ తర్వాత మోషే పొద దగ్గర నుండి ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తునుండి ఎర్ర సముద్రము దాటి అడవిలోనికి వెళ్ళి, సీనాయి కొండ ఎక్కెను. మంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళెను. అక్కడ దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ధన్యత మోషేకు దొరికింది. మనవలె ఒక గంట కాదు, 40 రోజులు తిండి, తిప్పలులేవు అది గొప్ప దైవసన్నిధి సహవాసము మనలో ఎవరైనా 40 దినాలు దేవుని సన్నిధిలో ఉంటే చచ్చిపోతారు. అన్నము లేక, నీళ్ళులేక చనిపోతారు. ఈ మోషే మాత్రము చావలేదు. మన బైబిలులో ఇప్పుడు చదివిన మొదటి మాట “నీవు నాకు జీవమార్గమును తెలియజేసెదవు” కీర్తనలు 16:11. అక్కడ మోషే మాత్రము చావలేదు. అక్కడ మోషే జీవముతో నుండెను. “నీ కుడిచేతితో నిత్యము సుఖములు కలవు" మోషే సుఖముగా ఉన్నాడు. మోషే దేవుని సన్నిధిలో 1) జీవముతో నున్నాడు, 2) సంతోషముగా నున్నాడు, 3) సుఖముగా ఉ న్నాడు. సన్నిధిలో ఉండేవారు అటువంటి ధన్యత తప్పక పొందుదురు. మన దేశములో ఒక ఆయన 40 దినములు లెక్కవేసుకొని ఉండాలని దేవుని సన్నిధికి వెళ్లిరి గాని కొందరు కృషించిపోయిరి. ఆయన దైవభక్తుడే సంపూర్ణ సమర్పణ గలవాడే, ప్రత్యక్షత గలవాడే. ఎందుచేతనోగాని 40 దినముల ఉపవాస సన్నిధి భాగ్యము కలుగలేదు. సన్నిధి భాగ్యము కలిగింది కాని ఆయనకు తెలియదు. మనకు తెలియదు. కొన్నిరోజులకే ఆయన శరీరము కృషించినది. మోషే అయితే 40 దినములు తిండి, తిప్పలు లేకపోయినా ఏమీ నీరసిల్లలేదు ఎంత ఆశ్చర్యము! మన తెలుగు జిల్లాలలో ఒక విశ్వాసి కలదు. దైవాజ్ఞ ప్రకారము 90 రోజులు ఉపవాసమున్నది. దైవసన్నిదిలో ఉండి 90 దినాలలో అప్పుడప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళు త్రాగేది ఎంత ఆశ్చర్యము!
10వ కథ: - దావీదు రాజు కథ. 1దిన. 28:19. (మోషే దావీదు). మోషే దగ్గరనుండి దావీదు మహారాజు వరకు ఒకటే పెద్ద గీత. దావీదు మహారాజుకి తీరుబడే లేదు. ఎప్పుడు యుద్ధము చేయడమే ఆయన పని. దావీదును గురించి ఒక మాట బైబిలులో ఉన్నది. మనిషి దేవునితో మాట్లాడినాడు అని దావీదుగారే సాక్ష్యమిస్తున్నారు.
దేవుడు కొండమీద మోషేకి 10 ఆజ్ఞలు అనుగ్రహించిరి. నిర్గమ 20:1. సీనాయి పర్వతము దగ్గర తమ నాయకుడైన మోషేద్వారా దేవుని ధర్మశాస్త్రాన్ని పొందడం ఇశ్రాయేలీయుల అనుభవములలో అతి ప్రాముఖ్యమైన అంశాలలో ఒకటి. దేవుడు మోషేకి 1) నైతిక ధర్మశాస్త్రం: పవిత్ర జీవితానికి సంబంధించిన దేవుని నియమాలు నిర్గమ 20:1–17. 2) పౌరసత్వాలు: సాంఘీక న్యాయానికి జనజీవనానికి సంబంధించిన సంగతులు నిర్గమ 20:1-23. 3) మత ధర్మశాస్త్రం: ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆరాధించడములో, బలియర్పణ అర్పించడములో అనుసరించవలసిన విధులు, పద్ధతులను బోధించారు. నిర్గమ 24:12; 31:18. అలాగుననే దేవుడు దావీదు రాజునకుకూడా బోధించారు 1దిన. 28:8. సొలోమోను దేవునిని తెలిసికొని ఆయనను సేవించి హృదయ పూర్వకంగా మనఃపూర్వకముగా ఆయనను ఆశ్రయించేలా చేయమని దావీదు దేవున్ని వేడుకొన్నాడు. (1) దేవున్ని తెలిసికోవడము అంటే ఆయన వ్యక్తిత్వం అనుభవ పూర్వకముగా గ్రహించి ఆయనను, ఆయన మాటను సమీప సహవాసములో నిలిపి కొనసాగుట (యోహాను 17:3). (2) దేవున్ని ఆశ్రయించడమంటే ఆయన కృపను, రాజ్యశక్తిని, నీతిని కోరుకొని మన జీవితాలలో ఆయన క్రియాశీలక సన్నిధికోసము ఎప్పుడూ అభ్యర్ధిచడమే ఆయన చిత్తానికి విధేయులుగా ఉండడము కోసము తీవ్రముగా ప్రయత్నించడమే. కాబట్టి మనము అలాగు దేవుని సన్నిధిలో ఉండవలెనని చెప్పి ముగించుచున్నారు.
Comments
Post a Comment